హైదరాబాద్, ఆగస్ట్ 25: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ తాజాగా ఇటలీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇటలీ సంస్థ సాంకేతిక సహకారంతో సూపర్ ప్రీమియం పెయింట్ల తయారీలోకి టెక్నో పెయింట్స్ అడుగుపెట్టనుంది. ఇందుకోసం కొత్త ప్లాంటుకు రూ.75 కోట్లు వెచ్చించనున్నట్టు టెక్నో పెయింట్స్ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు కావాల్సిన నిధులను బ్యాంకులతో పాటు ప్రైవేట్ ఈక్విటీ కంపెనీల నుంచి సమీకరిస్తామన్నారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే ఇటువంటి పెయింట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశంలో విక్రయిస్తున్నాయి. తాము మాత్రమే వీటి తయారీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నాణ్యమైన పెయింట్ల తయారీతోపాటు పెయింటింగ్ సేవలు అందిస్తున్న టెక్నో పెయింట్స్ ఆగస్ట్ 25న రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా కొత్త లోగోను రాజ్యసభ ఎంపీ, రామ్కీ గ్రూప్ ఫౌండర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆవిష్కరించారు.
కొత్త ప్లాంటులో..
కంపెనీ 6వ ప్లాంటును హైదరాబాద్ పటాన్చెరు సమీపంలోని చేర్యాల్ వద్ద నెలకొల్పుతోంది. ఈ అత్యాధునిక ప్లాంటులో తొలి దశ వార్షిక సామర్థ్యం 1.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉండనుంది. రెండవ దశలో మరో 50,000 మెట్రిక్ టన్నులు జోడిస్తారు. 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇక్కడ సూపర్ ప్రీమియం కోటింగ్స్, హై ఎండ్ లగ్జరీ ఎమల్షన్స్, డెకోరేటివ్ పెయింట్స్, స్పెషల్ టెక్స్చర్ ఫినిషెస్, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఎమల్షన్స్, డిజైనర్ ఫినిషెస్ తయారు చేస్తారు. మెటల్, వుడ్ ప్రైమర్స్, వుడ్ ఫినిషెస్ సైతం ఉత్పత్తి చేస్తారు.
ఇరవయ్యేళ్ల ప్రయాణంలో..
కంపెనీ ఈ రెండు దశాబ్దాల్లో పెయింటింగ్ సర్వీసుల విషయంలో 650 ప్రాజెక్టులను పూర్తి చేసుకుంది. చేతిలో 120 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆర్డర్ బుక్ రూ.600 కోట్లు ఉంది. హైదరాబాద్లో పెయింటింగ్ సర్వీసుల్లో అగ్ర స్థాయిలో ఉన్న టెక్నో పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్లో 50 శాతం వృద్ధి ఆశిస్తోంది. ఇప్పటి వరకు పెద్ద ప్రాజెక్టులు మాత్రమే చేపట్టిన సంస్థ ఇక నుంచి చిన్న ప్రాజెక్టులకు సైతం సేవలు అందించనుంది. రిటైల్ విక్రయాల్లో దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. కస్టమర్లు తమ మీద ఉంచిన నమ్మకం కారణంగానే విజయవంతంగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాగా, పెయింట్స్ పరిశ్రమలో 35 ఏళ్ల అనుభవం ఉన్న వి.నాగేశ్వర రావు కంపెనీలో సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్గా చేరారు. సంస్థ విస్తరణలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.